Swaroopananda swamy fires at Durg temple incident.Chandrababu Naidu Orders To Take Serious Action On Vijayawada Durga Temple Incident
విజయవాడ దుర్గ గుడిలో తాంత్రిక పూజల వ్యవహారం సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లింది. ఈ విషయమై చర్చించేందుకు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు భేటీ అయ్యారు.అంతకుముందు మీడియాతో మాణిక్యాల రావు మాట్లాడుతూ.. దుర్గగుడిలో జరిగిన ఘటనపై నలభై ఎనిమిది గంటల్లోగా తమకు నివేదిక వస్తుందని, దీని ఆధారంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక ఏ స్థాయి వ్యక్తి ఉన్నా వదలిపెట్టమని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజలపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానంద స్వామీజీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పీఠం తరపు లేఖ రాస్తామని, త్వరలో పీఠాధిపతుల సమావేశం ఏర్పాటుచేసి దేవాలయాలపై ప్రభుత్వ తీరుపై కోర్టులో కేసు వేస్తామన్నారు. దేవాలయ వ్యవస్థను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి స్వలాభం కోసం చూస్తున్నారని, హిందూ దేవాలయ ఆదాయాలు మీద ఉన్న మక్కువ దేవుడి మీద లేకపోతే ఇలాంటి ఘటనలే జరుగుతాయన్నారు.