Gold Rates Latest : బంగారం మన సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిపోయిన ఓ లోహం. పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు తప్పని సరైపోయిన వస్తువు. అయితే బంగారానికి ఎంత క్రేజ్ ఉందో దాని ధరలు కూడా అలాగే కొండెక్కి కూర్చున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదొడుకులతో పసిడి సామాన్యులకు భారమైపోయింది. ఏడాది క్రితం రూ.70 వేలు ఉన్న పసిడి నేడు ఏకంగా రూ.90 వేలు దాటింది. దీంతో ధరలు మరింత పెరుగుతాయా అనే సందేహం కలుగుతోంది.
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో బలంగా ఇమిడి పోయిన బంగారం ధరలు నేడు కొండెక్కి కూర్చున్నాయి. గత రెండేళ్లుగా అనూహ్యంగా పెరుగుతూ పది గ్రాముల బంగారం ధర రూ.90 వేలు దాటింది. వివిధ దేశాల ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు, ఆ దేశ అధ్యక్షుడు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగి బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. అమెరికా సుంకాలు, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు బంగారం ధరలు పెరగటానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో పది గ్రాముల పసిడి రూ. లక్ష దాటే అవకాశం కూడా ఉందని వ్యాపారులు చెబుతున్నారు.