Massive Robbery At Jewelry Store: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం బళ్లారి రోడ్లోని సయ్యద్ జువెల్లర్స్లో భారీ చోరీ జరిగింది. రూ. 6 లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలతో దొంగలు పరారయ్యారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఐదుగురు గుర్తు తెలియని దుండగులు బంగారం దుకాణం ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ముఖాలకు మాస్కులు ధరించి చోరీకి పాల్పడ్డారు. ముఖాలకు మాస్కులు ధరించడంతో దొంగలను గుర్తు పట్టడానికి వీలు కావడం లేదు. సుమారు అరగంట పాటు దుకాణంలో చోరీ జరిగింది. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దుండగులు దుకాణంలోని ట్రెజరీని తెరిచేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. బంగారు ఆభరణాలన్నీ ట్రెజరీలో ఉండటంతో పెద్ద నష్టం తప్పింది. ఆర్ అండ్ బీ ప్రధాన రహదారిలో పెద్ద ఎత్తున దొంగతనం జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సయ్యద్ జ్యువెలర్స్ షాపు యజమాని హారున్ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలు రప్పించి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.