Guntur Youth Subbu Shines as Author YUVA Story : గుంటూరుకు చెందిన ఆర్వీ సుబ్బు యువ రచయితగా ఆధునిక సాహిత్య ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తున్నాడు. సామాన్య ప్రజల జీవితాలు, సామాజిక అంశాలనే తన కథా వస్తువులుగా ఎంచుకున్నాడు. మన చుట్టూ ఉన్న మనుషుల్లోని అసాధారణ ప్రతిభను అక్షర రూపంలోకి మారుస్తున్నాడు. తెరవెనుక కష్టపడే నిజమైన కథానాయకుల జీవితాల గురించి 'మన హీరోలు' అనే పుస్తకం రాశాడు. ఈ పుస్తకంతోనే రచయితగా తొలి అడుగు వేశాడు. ఆ తర్వాత 'ఇంతకీ ఇప్పుడెక్కడికి' అనే మరో పుస్తకాన్ని కూడా రచించాడు. సామాన్యుల్లో దాగిన అసాధారణ ప్రతిభను వివరిస్తూ 'రైలు బండి' అనే పుస్తకాన్ని రాసి మెప్పించాడు.
సుబ్బు రాసిన ఈ పుస్తకాలకు పాఠకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రతిరోజూ మనం చూసే వ్యక్తుల జీవితాలను కళ్లకు కట్టినట్లు రాయడంతో పుస్తక ప్రియుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. 'ఒక వ్యక్తి పడే శ్రమను మనం గుర్తించగలిగితే, అదే గొప్ప రచనగా మారుతుంది' అని సుబ్బు బలంగా నమ్ముతున్నాడు. తనదైన శైలిలో రచనలు చేస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.