Nara Lokesh In Re Consecration Ceremony Of Rama Temple : గుంటూరు జిల్లా మంగళగిరిలోని కొప్పురావుకాలనీలో నూతనంగా నిర్మించిన రామాలయంలో పునఃప్రతిష్ట మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య హనుమంతుడు, లక్ష్మణ, సీతాసమేత శ్రీరాముల విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేశ్కు ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు, టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అనంతరం స్వామివార్లను మంత్రి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ మందిరానికి మంత్రి లోకేశ్ రూ. 5 లక్షలు విరాళం అందించారు. సీతారామ కోవెలలోని శ్రీ కోదండ సీతారామ స్వామిని కూడా మంత్రి నారా లోకేశ్ దర్శించుకున్నారు. తర్వాత ఆలయ అర్చకులు మంత్రి లోకేశ్కు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పునఃప్రతిష్ట కార్యక్రమం తమకెంతో ఆధ్యాత్మికతను కలిగించిందని భక్తులు అభిప్రాయపడ్డారు.