New Gates For The Tungabhadra Reservoir : దేశంలో తొలిసారిగా తుంగభద్ర జలాశయానికి సంబంధించిన కొత్త గేట్లను మూడు నెలల్లోనే ఏర్పాటు చేస్తున్నామని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. లక్షల మంది రైతులకు జీవనాధారమైన ఈ జలాశయం 2024 ఆగస్టులో వచ్చిన ప్రవాహాలతో టీబీ డ్యాంకు చెందిన 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. దీంతో అత్యవసర పరిస్థితుల కారణంగా అప్పట్లో ప్రవాహం ఉండగానే తాత్కాలిక గేటును అమర్చారు. జలాశయాల నిపుణులు కన్నయ్య నాయుడు టీబీ డ్యాం గేట్ల సామర్థ్యాన్ని పరీక్షించారు. వెంటనే వాటిని మార్చాలని కూటమి ప్రభుత్వానికి నివేదిక అందించారు. దీంతో పాతగేట్లు తొలగించి కొత్త గేట్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ముప్పై కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే కొత్తగా 21 గేట్లను ఏర్పాటు చేశాం. నెల రోజుల్లో మరో 12 గేట్లు ఏర్పాటు చేస్తాం. జలాశయానికి ఉన్న 33 గేట్ల తయారీని రెండు వేర్వేరు ఇంజనీరింగ్ సంస్థలకు అప్పగించాం. దీంతో ఈ రెండు సంస్థలు గేట్లు అమర్చేందుకు వేగంగా పనులు చేస్తున్నాయి. రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా రైతులకు మాత్రం తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని పయ్యావుల కేశవ్ వెల్లడించారు.