BJP MLA Rajasingh Received Scam Call : సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో మోసాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరినీ టార్గెట్ చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను మోసం చేసేందుకు నేరగాళ్లు ప్రయత్నం చేశారు. ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి పేరుతో ఫోన్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో భాగంగా 30 మందికి సబ్సిడీపై లోన్ వస్తుందంటూ తనను నమ్మించే ప్రయత్నం చేసినట్లు రాజాసింగ్ చెప్పారు. యువతకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చొప్పున నియోజకవర్గానికి మొత్తంగా రూ.3 కోట్ల చొప్పున మంజూరు చేసేందుకు అవకాశం ఉందని నేరగాళ్లు చెప్పినట్లు రాజాసింగ్ తెలిపారు. అయితే సదరు అధికారి వ్యవహారశైలిపై అనుమానంతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కార్యాలయ సిబ్బందికి ఫోన్ చేసినట్లు చెప్పారు. అలాంటి పథకం కానీ, సదరు అధికారి గానీ లేరని తనకు సమాచారం వచ్చిందని రాజాసింగ్ తెలిపారు. ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లపై ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.