TDP Mahanadu 2026: మహానాడు వేదికపై సామాన్యులకు మాట్లాడే అవకాశం కల్పించారు. మహిళ కార్యకర్తలు కొంకు విశ్రాంతమ్మ, కన్నెటి పద్మజ, సూదిమళ్ల సునీత తదితరులు తమ బాధలు చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సంతోషంగా సాగిపోతున్న కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంటే ఆ బాధ వర్ణనాతీతం. ఒకవైపు భర్త అనారోగ్యం, మరోవైపు కన్నకొడుకు రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడం వంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోతే, ఆపదలో ఉన్నప్పుడు ఓదార్చే చేయి, నేనున్నాను అనే నమ్మకం ఎంతో ముఖ్యమో వారు వివరించారు. కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యుల్లా భావించి, పార్టీ తరపున అందించిన బీమా సాయం ఆ కుటుంబానికి కేవలం ఆర్థిక అండ మాత్రమే కాకుండా బతుకుపై ఒక ఆశను చిగురింపజేసిందని వెల్లడించారు. ఆ మహిళలు వేదికపై మాట్లాడుతున్నప్పుడు వెనక సీట్లలో కూర్చున్న నాయకులు, తోటి కార్యకర్తల కళ్లలో కనిపించిన ఆర్ద్రత కేవలం రాజకీయ వేదికను కాకుండా, ఒక ఆత్మీయ కుటుంబ సమ్మేళనాన్ని గుర్తు చేసింది.