Mana Badi Pilustundi Promotional Song : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ "బడి పిలుస్తోంది" ప్రచార కార్యక్రమంలో భాగంగా రూపొందించిన "మనబడి పిలుస్తోంది" ప్రత్యేక గీతాన్ని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా కమిషనరేట్లో ఆవిష్కరించారు. ఈ పాట కూటమి ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను ప్రతిబింబిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో లభించే నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ బోధనను ఇందులో అద్భుతంగా వివరించారు. అలాగే విద్యార్థుల సంక్షేమ పథకాలు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం వంటి ముఖ్యాంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా దీనిని రూపొందించారు. ఈ గీతాన్ని రచించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు చల్ల మధుసూదనరావును, ఆయన సాంకేతిక బృందాన్ని కమిషనర్ అభినందించారు. ఇటువంటి సృజనాత్మక ప్రయత్నాలు ప్రభుత్వ విద్యా కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని కమిషన్ చైర్పర్సన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు కొనియాడారు. బాలల హక్కులు, సంక్షేమం కోసం కమిషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా మంత్రి ఓఎస్డీ ఆకుల వెంకటరమణతో పాటు పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.