Fire Department DG interview : వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థలు పునఃప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు, కళాశాలల భవనాల్లో అగ్నిప్రమాదాల నియంత్రణ కోసం పరికరాల ఏర్పాటు, వాటి పనితీరుపై అగ్నిమాపక శాఖ అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా, అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు లేని విద్యాసంస్థల యాజమాన్యాలకు లోపాలను సరిదిద్దుకునేందుకు తగిన గడువు ఇస్తున్నట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. అలాగే పాఠశాల, కళాశాలల్లో ఉండే ఉపాధ్యాయులు, సిబ్బందికి కూడా అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ దానికి సంబంధించిన మాక్ డ్రిల్స్ను కూడా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని సుమారు 80 శాతం విద్యాసంస్థలు అగ్నిభద్రతా నిబంధనలు పాటిస్తున్నట్లు గుర్తించామని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. చిన్నారుల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని అగ్నిమాపక శాఖ డైరక్టర్ జనరల్ వెంకటరమణ పేర్కొన్నారు.