Fire Accident Near Anakapalli : అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమయస్ఫూర్తితో ప్రయాణికులందరూ కిందకు దిగిపోవడంతో తృటిలో ప్రాణనష్టం తప్పింది.
ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి తమిళనాడులోని చెన్నై నగరానికి ప్రయాణికులతో బయలుదేరిన తులసి ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ స్లీపర్ బస్సు రేగుపాలెం జంక్షన్ వద్దకు చేరుకోగానే ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఇంజిన్ భాగం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రహదారి పక్కన నిలిపివేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సులోని వైరింగ్లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది శ్రమించారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి, ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.