Lokesh Vs Baba Ramdev in Asanas : 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేకువజామునే వెంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణతో చేసిన యోగా సాధన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్తో కలిసి వేదికపై ఆసనాలు వేశారు. ముఖ్యమంత్రి 45 నిమిషాల పాటు సంక్లిష్టమైన ఆసనాలను ఎంతో సునాయసంగా వేసి అందరినీ అబ్బురపరిచారు. ఈ వయస్సులోనూ ఆయన ఉత్సాహం అక్కడివారిని ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు వేదికపై మంత్రి లోకేశ్తో రాందేవ్ బాబా యోగాసనాలు వేయించారు. అనులోమ, విలోమ పద్ధతిలో ప్రాణాయామం చేస్తూ లోకేశ్ ఎంతో ఉత్సాహంగా, బాబా రాందేవ్తో పోటీపడ్డారు. ఈ దృశ్యాన్ని చూసి పక్కనే ఉన్న చంద్రబాబు ముసిముసిగా నవ్వులు చిందించారు. ఈ దృశ్యాలు అక్కడివారిని ఆకట్టుకున్నాయి.