Chandrababu Call To Bhuvaneshwari : సీఎం చంద్రబాబు శనివారం నాడు పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. అన్నదాత సుఖీభవ కార్యక్రమం కోసం చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని లింగంగుంట్ల గ్రామానికి వచ్చిన సీఎం, అక్కడ గుడిపల్లి నాగభూషణం అనే రైతుకు చెందిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఎద్దు గానుగ ద్వారా సంప్రదాయ పద్ధతిలో వేరుసెనగ, కొబ్బరి, నువ్వుల నూనెలు ఉత్పత్తి చేసే విధానాన్ని ముఖ్యమంత్రి ఆసక్తిగా పరిశీలించారు.
ఎద్దు గానుగ ఎక్కి బాల్యస్మృతుల్ని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే తన సతీమణి భువనేశ్వరికి ఫోన్ చేసిన చంద్రబాబు ఇంట్లోకి ఏమేం కావాలంటూ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆ నూనెల ప్రత్యేకతను ఆమెకు వివరించారు. ఆమె కోరిక మేరకు రూ.3 వేలతో కొబ్బరి, నువ్వులు, వేరుసెనగ నూనెలు కొన్నారు. ఈ క్రమంలో కష్టపడిన వారికి, ఆ కష్టానికి తగ్గట్టు డబ్బులివ్వకుండా బేరాలాడతారేంటి అంటూ ముఖ్యమంత్రిని భార్య భువనేశ్వరి ప్రశ్నించారు. ఒకే బూ అంటూ ఆమె చెప్పినట్లు సీఎం చేసేశారు. ఇంట్లోకి కొనుగోలు చేసిన వస్తువులకు డబ్బులివ్వడంతోపాటు ఆ వ్యవసాయ క్షేత్రంలో పని చేసేవారికి తలా రూ.5 వేలు ఇవ్వండంటూ భార్య చెప్పగా ఆమె మాటకు విలువిచ్చారు. ఇప్పుడు వారిద్దరి మధ్య సాగిన ఫోన్ సంభాషణను చూద్దాం.