AP Rare Disease Policy : అరుదైన వ్యాధులతో బాధపడే వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకురాబోతోంది. అరుదైన వ్యాధుల బారిన పడిన రోగులు తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను ముందుగా గుర్తించిన ప్రభుత్వం వారికి అండగా నిలవాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. ఇకపై ఇలాంటి రోగులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తారు. వారికి అవసరమైన ఖరీదైన వైద్య సేవలను కూడా పూర్తిగా ఉచితంగానే అందించనున్నారు. మరింత మెరుగైన వైద్యం కోసం రాష్ట్రంలో మూడు ప్రత్యేక రిఫరల్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటుగా రాష్ట్రంలో ఒక 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ'ని కూడా తీసుకురావడానికి కసరత్తు జరుగుతోంది.
వ్యాధిగ్రస్థుల వివరాల నమోదు కోసం 'రేర్ డిసీజెస్ రిజిస్ట్రీ'ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రోగులకు మెరుగైన ట్రీట్మెంట్ అందించేలా డాక్టర్లకు సైతం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ కార్యాచరణపై నోడల్ ఆఫీసర్, అడిషనల్ డీఎంఈ రాధికారెడ్డి ముఖాముఖిలో పలు కీలక వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పేద రోగులకు ఎంతో మేలు జరుగుతుందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.