A Hired Bus Lost Control And Crashed Into The Platform In Nellore RTC Bus Stand : నెల్లూరు ఆర్టీసీ ప్రధాన బస్టాండ్లో సోమశిల నుంచి వచ్చిన అద్దె బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు అదుపుతప్పి ప్లాట్ఫారంపైకి దూసుకెళ్లడంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ఈ ప్రమాదంలో అయిదుగురు ప్రయాణికులు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఒక్కసారిగా బస్సు వేగంగా వచ్చి ప్లాట్ఫారంపైకి దూసుకురావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఉన్న వారు ప్రాణభయంతో పరుగులు తీశారు.
డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? : డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అంటున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో పాటు వేగాన్ని అదుపులో ఉంచకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టి ప్రమాదానికి గల అసలు కారణాలను ఆరా తీస్తున్నారు.