Mosquito Spray In Musi With Drone : మూసీ నదిలో విస్తరిస్తున్న గుర్రపు డెక్క కారణంగా క్యూలెక్స్ దోమలు పెరుగుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోన్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బుధవారం సీనియర్ ఎంటమాలజిస్ట్ గంగప్ప ఆధ్వర్యంలో అత్తాపూర్ నుంచి బాపూఘాట్ వరకు డ్రోన్ ద్వారా మస్కిటో లార్విసైడ్ ఆయిల్ను స్ప్రే చేశారు.
ఈ సందర్భంగా గంగప్ప మాట్లాడుతూ, గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించేందుకు ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్, హిటాచి వంటి ఆధునిక యంత్రాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. గుర్రపుడెక్క కింద పెరిగే క్యూలెక్స్ దోమలు రక్తాన్ని పీల్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాయని అన్నారు. అయితే ఇవి సాధారణంగా వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు కావని గంగప్ప స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ చేపడుతున్న చర్యలతో మూసీ పరివాహక ప్రాంతాల్లో దోమల సమస్య తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.