Balkampet Yellamma Kalyanotsavam : హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మతల్లి వార్షిక కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 3 గంటల నుంచే అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అలంకరణ కార్యక్రమాలు నిర్వహించగా, తెల్లవారు జాము నుంచే వేలాదిగా భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. ఉదయం 11 గంటల 59 నిమిషాలకు శుభ ముహూర్తంలో అమ్మవారి వార్షిక కల్యాణ మహోత్సవం వేదమంత్రోచ్చారణల నడుమ అత్యంత వైభవోపేతంగా జరిగింది. అమ్మవారి కల్యాణాన్ని వీక్షించేలా అధికారులు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి, కుమార్తె నైమిషారెడ్డి అమ్మవారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ వేడుకున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో నిన్న ఎదుర్కోలు, నేడు కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగగా రేపు రథోత్సవం జరగనుంది.