Drone Monitor Traffic At Golconda : గోల్కొండ బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తొలిసారిగా అత్యాధునిక డ్రోన్ నిఘాను ఉపయోగిస్తున్నారు. జూలై 16న మొదలై ఆగస్టు 13 వరకు జరిగే ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఆదేశాల మేరకు జాయింట్ సీపీ (ట్రాఫిక్) డి. జోయెల్ డేవిస్ పర్యవేక్షణలో డీసీపీ (ట్రాఫిక్) కాజల్, ఏసీపీ (ట్రాఫిక్) గోల్కొండ జోన్ డి. ధనలక్ష్మి ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని గోల్కొండ కోట పరిసరాల్లో తొలిసారిగా డ్రోన్ సర్వేలెన్స్ను వినియోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ మళ్లింపు కేంద్రాలు, రద్దీ ప్రాంతాలను ఆకాశమార్గంలో పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ జామ్లను తక్షణమే గుర్తించి నియంత్రిస్తున్నారు. ఈ ఆధునిక సాంకేతికతతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.