Loddi Mallayya Jatara 2026 in Nallamalla : ఎటు చూసినా పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలు, ఎత్తయిన కొండల నడుమ జాలువారే కృష్ణమ్మ జల సవ్వళ్లతో ఆకట్టుకునే నల్లమలలో సలేశ్వరం, ఉమామహేశ్వరం తర్వాత లొద్ది మల్లయ్య క్షేత్రం అత్యంత ప్రసిద్ధి పొందింది. నల్లమలలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లొద్ది మల్లయ్య స్వామి ఆలయంలో ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం బాణాల శివారులోని అటవీ ప్రాంతంలో కొలువైన లొద్ది మల్లయ్యకు ఏటా తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు జాతర నిర్వహిస్తారు. సుమారు రెండున్నర కిలోమీటర్లు అందాల అడవిలో వాగులు, వంకలు, కొండలు, గుట్టలు దాటుతూ వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ ఎత్తైన కొండల మధ్య నుంచి సన్నగా జాలువారే జలపాతం, దాని కింద ఉన్న గుండంలో స్నానాలాచరించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో పులుల సంచారం పెరగడంతో ఆంక్షలు విధించిన అటవీ శాఖ అధికారులు కొద్ది మందికి మాత్రమే అనుమతిచ్చారు. నిఘా నేత్రాలు, ఫారెస్టు సిబ్బంది పర్యవేక్షించగా సుమారు 3 వేల మంది లొద్ది మల్లయ్య స్వామిని దర్శించుకున్నారు.