Ministers Enjoying The View Of Sappiputtu : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో ఎన్నడూ చూడని వింతైన ప్రకృతి అనుభూతి కనిపిస్తుంది. సహజ సిద్ధమైన వీచే గాలి, కొండలను తాకే మేఘాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాడేరు మండలం సప్పిపుట్టు కొండలు 3500 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఇద్దరు మహిళా మంత్రులు ఈ సుందర ప్రాంతాన్ని వీక్షించి తన్మయత్వానికి లోనయ్యారు. పర్యాటక ప్రపంచానికి ఇటువంటి ప్రాంతాలు కావాల్సిందని కొనియాడారు. రెండేళ్ల ప్రభుత్వ పాలనలో ప్రకృతి ఎంతగానో సహాయ సహకారాలు అందించిందని మంత్రులు పేర్కొన్నారు. వీడియోల రూపంలో బాహ్య ప్రపంచానికి చూపించాలంటూ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. ఇంతటి అద్భుత లోకాన్ని చూడటం ఎంతో ఆనందదాయకమని హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత సంతోషం వ్యక్తం చేశారు. ఈ కొండల్లో ఆ చల్లదనంలో గిరిజన మహిళలు థింసా డాన్స్ చేస్తుంటే మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వాళ్లతో కలిసి నృత్యం చేశారు. చిరుజల్లులు కురుస్తుంటే ఈగల్ టీమ్ ఐజి వారితో కలిసిపోయి డప్పు వాయించారు. ఎవరికి దక్కని భాగ్యం మాకు దక్కిందని మంత్రులు అన్నారు. వివిధ శాఖల అధికారులు అందరూ కలిసి కొండ ప్రాంతం ఎక్కేసరికి మరో ప్రపంచాన్ని వీక్షించి సంతోషించారు.