Godavari floods In Ambedkar Konaseema : గోదావరిలో వరద ప్రవాహం వేగంగా పెరుగుతోంది. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 12.60 అడుగులకు చేరుకోగా, మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి కారణంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాజ్వేలు వరదలో కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి. ప్రజలు బోట్లనే ఆశ్రయించి నిత్యావసరాల కోసం ప్రయాణిస్తున్నారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కనకాయలంక గ్రామంలో వ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకుంటున్నాంమని వెటర్నరీ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు. పశువులకు వ్యాధులు రాకుండా వ్యాక్సినేషన్ చేస్తున్నామన్నారు. పశువులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం మేం ఇక్కడికి వచ్చామని ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు అన్నారు. సమయం గడిచే కొద్ది వరద ఉద్ధృతి పెరుగుతోందన్నారు.