Fishermen Caught Thirty Kilogram Fish : రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్య మానేరు ప్రాజెక్టు నీటిలో 30 కిలోల భారీ చేప మత్స్యకారునికి చిక్కింది. ఆరు రోజులుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మధ్య మానేరు ప్రాజెక్టుకు నీటిని తరలిస్తున్నారు. వరద కాలువ చివరన, వరదవల్లి దత్తాత్రేయ స్వామి గుట్ట సమీపంలో వివిధ ప్రాంతాల మత్స్యకారులు చేపల వేట సాగిస్తున్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన రాజ్కుమార్ అనే మత్స్యకారుడి వలలో 30 కిలోల బరువున్న 'బొచ్చ' (కాట్లా) చేప చిక్కింది. అయితే ఆ చేపను నీటిలోంచి బయటకు తీయడానికి ముగ్గురు మత్స్యకారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. జలాశయంలో గతంలోనూ 20 కిలోల కంటే ఎక్కువ బరువున్న చేపలు వలలో చిక్కాయి. అయినప్పటికీ ఇంత భారీ పరిమాణం ఉన్న చేపను తాము ఎప్పుడూ చూడలేదని మత్స్యకారులు పేర్కొన్నారు. ఈ చేపలు నీటి ప్రవాహానికి ఎదురుగా ఈదుకుంటూ వస్తున్నాయని వారు తెలిపారు.