Wedding Bus Halted By Flood Waters : కామారెడ్డి జిల్లా కేంద్రంలో అర్థరాత్రి భారీ వర్షం కురిసింది. రామారెడ్డి రోడ్డులోని సుభాష్ టాకీస్ సమీపంలో రోడ్డుపై భారీగా నీరు ప్రవహించింది. గొల్లపల్లి నుంచి రంగంపేటకు పెళ్లి కార్యక్రమానికి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఆ మార్గంలో వెళ్తుండగా సైలెన్సర్లో నీరు చేరింది. దీంతో బస్సు రోడ్డు మధ్యలోనే నిలిచిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే కామారెడ్డి పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోప్ సహాయంతో బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం ప్రయాణికులను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరో బస్సులో వారి గమ్యస్థానానికి పంపించారు. పోలీసు, ఫైర్ శాఖల సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలు, సమన్వయంతో చేపట్టిన సహాయక చర్యల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పరిస్థితిని విజయవంతంగా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ భారీ వర్షాల సమయంలో వరద నీరు ప్రవహిస్తున్న రహదారులు, వాగులు, కల్వర్టులను దాటేందుకు ప్రయత్నించవద్దన్నారు. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించి, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.