Car Stuck In Flood Water : ఖమ్మం జిల్లాలోని ఏనుకూరు మండలంలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన నాచారం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్న వాగు ఉద్ధృతికి వంతెన నిర్మాణంలో భాగంగా వేసిన 'తాత్కాలిక మట్టి రహదారి' పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ క్రమంలోనే ఆలయ దర్శనం ముగించుకుని కారులో తిరుగు ప్రయాణమైన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రయాణికులు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు.
కారు నీట మునుగుతున్న విషయాన్ని గమనించిన స్థానిక రైతులు, యువకులు వెంటనే స్పందించి, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ట్రాక్టర్, తాళ్ల సహాయంతో సాహసోపేతంగా వ్యవహరించారు. కారుతో పాటు అందులోని నలుగురు ప్రయాణికులను సైతం సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఎవరూ కూడా పొంగిపొర్లుతున్న వాగులను దాటడానికి ప్రయత్నించవద్దని, నిర్మాణంలో ఉన్న తాత్కాలిక రహదారుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.