Surprise Me!

వర్షాల కోసం పెళ్లి కానీ యువతీయువకుల ప్రత్యేక పూజలు - శ్రీ మల్లేశ్వర స్వామికి 1008 బిందెలతో జలాభిషేకం

2026-08-10 9 Dailymotion

JalaBhishekam In Malleswara Swamy Temple For Rains : ఈ ఏడాది సూపర్ ఎల్​నినో ప్రభావం కారణంగా వర్షాలు అంతగా కురవడం లేదు. దీంతో రైతులు వర్షాన్ని నమ్ముకొని వేసిన పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ఇందుకోసం రాష్ట్రంలో ప్రజలు వరుణదేవుణ్ణి కరుణింపజేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా అనేక విధాలుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గాడిదలకు పెళ్లిళ్లు, కుక్కలకు పూజలు ఇలా పలు రకాలుగా ప్రయత్నిస్తున్నారు. వర్షం కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో సోమవారం యువతీ యువకులతో 1008 బిందెలతో జలాభిషేకం చేశారు. ఆలయం వెలుపల నుంచి శివలింగం వరకు బిందెలతో నీరు పోస్తూ ఓం నమశ్శివాయ అంటూ  బిందెలతో స్వామివారికి జలాభిషేకం చేశారు. అనంతరం ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీరామేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వరుణ యాగం నిర్వహించారు. ఆలయ అర్చకులు నీటిలో కూర్చుని మంత్రోచ్ఛారణ పూజలు చేశారు. సమృద్ధిగా వర్షం వచ్చి పంటలు బాగా పండాలని కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు గ్రామస్తులు తెలిపారు.