Jagan Kurnool visit : వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా ఆయనకు వ్యతిరేకంగా ఓర్వకల్లు విమానాశ్రయం వద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ ఫోటోతో ఉన్న ఫ్లెక్సీలు విమానాశ్రయం వెలుపల పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. జగన్ గో బ్యాక్ అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎస్సీలపై దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యేని పరామర్శించడానికి సిగ్గు లేదా జగన్ అంటూ ఫ్లెక్సీలో రాశారు. డీఎస్సీపై చర్చించడానికి అసెంబ్లీకి రావాలంటూ వేరువేరుగా ఫ్లెక్సీలు వేశారు. ఈ ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. విమానాశ్రయం వద్దకు పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. ఎవరిని లోపలికి అనుమతించకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. జగన్ పర్యటన సందర్భంగా ఆ పార్టీ నాయకులు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఓర్వకల్లు ఎయిర్పోర్టు నుంచి జైలు వరకు కేవలం జగన్ కాన్వాయ్కు మాత్రమే అనుమతి ఉందని జిల్లా ఎస్పీ అన్నారు.