Minister Nadendla Manohar on YSRCP : వైఎస్సార్సీపీ పాలనలో రాజధాని రైతులను ఎన్నో అవమానాలకు గురిచేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణం కోసం 30 వేల మంది రైతులు ముందుకొస్తే, వారిని అవమానించారని మండిపడ్డారు. గత ఐదేళ్లు వైఎస్సార్సీపీ పాలనలో స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు రాజధాని రైతులను నానా ఇబ్బందులు పెట్టారని, వాటిని రైతులు ఎప్పటికీ మర్చిపోకూడదని మంత్రి సూచించారు. రైతులు ఆనందంగా ఉండాలనేదే పవన్ కల్యాణ్ కోరికని నాదెండ్ల మనోహర్ తెలిపారు. నాడు పర్యటనల్లో పవన్ స్వయంగా రైతుల బాధలను చూసి చలించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతి నిర్మాణ కలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో రాజధాని అభివృద్ధికి మరిన్ని వేగవంతమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ సందర్భంగా చారిత్రాత్మక పోరాటం చేసిన అమరావతి రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.