Anna Lezhneva visits Pithapuram temple : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించారు. ఇక్కడి ప్రసిద్ధ పాదగయా క్షేత్రంతో పాటు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానాన్ని ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవోలు జగన్మోహన్ శ్రీనివాస్, సౌజన్య ఆమెకు ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభం, ఆలయ లాంఛనాలతో సాదరంగా లోపలికి ఆహ్వానించారు. అనంతరం అన్నా లెజినోవా స్వామివార్లను దర్శించుకున్నారు. కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయుడు, పురుహూతికా అమ్మవారు, శ్రీపాద శ్రీవల్లభ స్వాములకు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.
అన్నా లెజినోవా కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నప్పుడు పండితులు ఆమెకు ఆలయ స్థల పురాణాన్ని వివరించారు. ఆ పురాణాన్ని తనకు ఆంగ్లంలో కాకుండా కేవలం 'తెలుగు'లోనే వివరించాలని ఆమె పండితులను కోరారు. తెలుగు భాషపై ఆమె చూపించిన ఈ మక్కువను చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.