Harish Rao Comments On Ponguleti : లక్షల మందిని ఆగం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తక్షణమే నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేత హరీశ్రావు డిమాండ్ చేశారు. దరఖాస్తులు లేకుండా ఎట్లైతే నిషేధిత జాబితాలో చేర్చారో అలానే తొలగించాలన్నారు. మల్కాజ్గిరిలో 22ఏ నిషేధిత భూముల బాధితుల సభలో హరీశ్ రావు పాల్గొన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలకు ఎందుకు శిక్ష అని ఆయన ప్రశ్నించారు. తప్పు చేసిందే మీరే ఆ చేసిన తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మీదేనని స్పష్టం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు తన చేతిలోకి రావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా అధికారులను ఆదేశించి రాత్రికి రాత్రే ఈ ఆస్తులను బ్లాక్ చేయించారని ఆరోపించారు. అసలు నిషేధిత జాబితాలో భూములను పెట్టాలని చెప్పింది ఎవరు? దీనికి బాధ్యులు ఎవరు? తక్షణమే తేల్చాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.