Surprise Me!

టీచర్ పోస్టులేమీ వాలంటీర్ ఉద్యోగాలు కావు: మంత్రి సంధ్యారాణి

2026-06-05 3 Dailymotion

​Sandhyarani Slams YSRCP : మెగా డీఎస్సీపై వైఎస్సార్సీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మండిపడ్డారు. వారు ఎన్ని దగాకోరు మాటలు మాట్లాడినా ప్రభుత్వం వెనక్కి తగ్గదన్నారు. మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. 2025 మెగా డీఎస్సీలో 2 వేల మంది గిరిజన అభ్యర్థులు టీచర్లుగా ఎంపికయ్యారని ఆమె గుర్తు చేశారు. ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేయడానికి అవేమీ వాలంటీర్ ఉద్యోగాలు కావని ప్రతిపక్షాలపై ఎద్దేవా చేశారు.

ఉపాధ్యాయుల సత్తా ఏంటో గత ఎన్నికల్లోనే వైఎస్సార్​సీపీకి తెలిసిందన్నారు. టీచర్లకు కోపం వస్తే ఫలితం ఎలా ఉంటుందో ప్రజలు చూపించారని చెప్పారు. అందుకే ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నారు. ఘోర పరాజయం తర్వాత కూడా ఆ పార్టీ నేతల్లో ఇంకా పరిజ్ఞానం రాలేదని విమర్శించారు. విచక్షణ లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే వారు ఆరాటపడుతున్నారని ఆమె అన్నారు. పార్టీని బతికించుకునేందుకు వారు పడుతున్న పాట్లను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి తేల్చిచెప్పారు.