TDP Minister Narayana About State Development: కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే ఓట్లు వేస్తారని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు చిల్డ్రన్ పార్క్ను ఆయన పరిశీలించారు. 'స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం కింద వివిధ చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజల దృక్పథంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో, ఈ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి నెలా మూడవ శనివారం ఒక జిల్లాను సందర్శిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం విజయం అందరి భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుంది. గత ప్రభుత్వం ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల 50 లక్షల టన్నులకు పైగా వ్యర్థాలు పేరుకుపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం నిర్దేశించుకున్న ఏడాది గడువులోగా ఈ వ్యర్థాలను తొలగించేందుకు కృషి చేస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రాన్ని స్వచ్ఛంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ అంటున్నారు. 2026 అక్టోబర్ 2 వరకు 'స్వచ్ఛ ఆంధ్ర' అంటే ఏంటో చూపిస్తామని తెలిపారు.